ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 6, 2025న ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తిని నిరోధించే చర్యలను సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిపై నిఘా ఉంచాలని, అవసరమైతే పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, ఇతర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2001 నుంచి హెచ్ఎంపీవీ ఉన్నప్పటికి మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. హెచ్ఎంపీవీ సాధారణ సీజనల్ వ్యాధి అని, ఇందులో తేలికపాటి లక్షణాలు ఉంటాయని వారు వివరించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
HMPV లక్షణాలలో సాధారణంగా ముక్కు కారడం, దగ్గు, మూసుకుపోయిన నాసికా రంధ్రాలు, గొంతు నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. ఇది ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే వైద్యారోగ్య శాఖ అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలన్నారు.